Tuesday, October 30, 2012


ఒంటరివా నీకోసమే 
---------------------------
మూగబోయిన గొంతు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సార్లు ప్రతిస్పందించదు  .ఎన్ని పరిస్థితులు ఆ గొంతును మూగ బోయేలా చేసుంటాయో .ఎన్ని భయానక వాహనాలు ఆ గొంతు దారులగుండా ప్రయాణించి మాటలని అణిచి 
వేసుంటాయో .ఎన్ని అవమానాలు నిందలు ఆ గొంతులోని  మాటల్ని త్రవ్వి వేసాయో.
అలాంటి వాళ్ళపై  సమాజము ,మనుషులు జాలి పడకుండా వుండరు . కొందరైతే  జాలి చూపకపోగా ఇంక్కొన్ని రాళ్ళు వేసి వెళ్తారు , ఏదైతేనేం  బైబిలు లో కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్లి ఒంటరి తనం అనుభవించిన వారు లేక పోలేదు కాని ఆ ఒంటరితనంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి పాఠం నేర్పుతూ వచ్చాడు .

యాకోబు తండ్రిని మోసం చేసి , అన్నను మోసం చేసి ,ఇంటి నుంచి మోసగాడి గా పారిపోయి అరణ్యానికి చేరాడు .
అంతవరకు సాధువై గుడారములో నివసించిన వాడు (ఆది కాండము 25:27).కాని ఇప్పుడు ఒంటరి వాడిగా చావు భయాన్ని మెడలో వేసుకొని తెలియని స్థలానికి ఒంటరిగా ప్రయాణమయ్యాడు . మోసగాడనే అర్ధమిచ్చే పేరు పెట్టుకున్నందుకు సార్ధకం చేసుకున్నాడని తండ్రే అన్నాడంటే అతని మానసిక స్థితి ఎంత ఆందోళనగా ఉండి  ఉందో .
జ్యేష్టత్వాన్ని దొంగిలించాడు , ఆశీర్వాదాలని  దొంగిలించాడు , కాని ఏం లాభం ఒంటరిగా ప్రశాంతతని పోగొట్టుకొని ప్రాణ భయంతో కుటుంబం నుంచి సహవాసం నుంచి ఒంటరితనంలోకి , ఎవరూ  తెలియని క్రొత్త ప్రదేశానికి నడక ప్రారంభించాడు. ఏవేవి నేమరేసుకుంటూ ,తనలో తానూ ఏవేవి మాట్లాడుకుంటూ బయలుదేరాడో ?!.మనలో కొందరిలాగే తప్పు చేసామన్న భావన సమాజం చీత్కారం స్వీకరించి ఒంటరి చేయబడి మన నుంచి మనమే పారిపోయే సమయం కూడా  ఇలాగే ఉంటుంది కదూ ..

రోజంతా బెయేర్షెబానుండి బయలుదేరి హారాను వైపు నడిచాడు చీకటి పడింది ఒక చోట ఆగాడు (ఆదికాండము 28:10-11).ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికుని, అక్కడ పండుకున్నాడు.
ఒంటరి తనం భయం నిద్రలో కూడా వేటాడాలిగా  కాని మనం మర్చి పోతాం దేవుని ప్రణాళికలో ఉన్న వారిని ఆయన విడిచి పెట్టడని .నువ్వు నేను ఏ ప్రణాళికతో ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డామో అవి నేరవేరే వరకు లోకం విడిచినా ,స్నేహితులు బంధువులు నాఅన్న వారు వదిలేసినా నిన్ను చేసిన నీ సృష్టికర్త వదలడని .  
అదే జరిగింది.
ఒక కలకన్నాడు అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండింది ; దాని కొన ఆకాశమునంటి ; దానిమీద నుంచి దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉన్నారు . దేవుడు దాని పైగా నిలిచి నీకు నీ సంతానానికి ఈ స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు .ఆదరణ పొందుకుని వాగ్దానాన్ని తీసుకుని బయలు దేరాడు .తండ్రి దగ్గర మోసం చేసి పొందిన దీవెనల కన్నా దేవుని దీవెనలు ఎంత బలపరిచాయో యాకోబుని క్షేమంగా తిరిగొస్తే మళ్ళీ ఆ స్థలంలో బలిపీఠాన్నికట్టి స్తుతి చెల్లిస్తానన్నాడు.
ఇహలోక తండ్రి దీవెన కుటుంబానికి దూరం చేసింది . పరమతండ్రి దీవెన తిరిగి ఉత్సాహాన్ని నింపింది .
ఈ రోజు నువ్వు అదే పరిస్తితుల్లో ఉంటే దేవుణ్ణి మాట్లాడమని నీ జీవితపు ఉద్దేశం తెలుపమని అడుగుతావా ?.
వెతికి చూడు .

అక్కడికి అవలేదు ...
తల్లి చెప్పినట్టే మామ దగ్గరకి చేరాడు .ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ,పిల్లల్ని కన్నాడు సంతానం వృద్ది చెందింది  అక్కడా తగినంత సంపాదించాడు . కాని ఆ సంపాదన జీతంగా తీసుకుని మామ ప్రేమ తగ్గిపోయిందని (ఆదికాండము 31:5) ఆస్తి విషయంలో జీతం విషయంలో మనస్పర్ధలు (ఆదికాండము 31:1) తిరిగి దేవుడు తనతో మాట్లాడిన విషయం (ఆదికాండము 31:11) లేయా  ,రాహేలను తన భార్యలకి చెప్పి అంతకాలం ఆశ్రయం ఇచ్చిన మామకే చెప్పకుండా బయల్దేరి మోసం చేసిన వాడు అయ్యాడు (ఆదికాండము 31:20). ఇప్పుడు యాకోబు మామ దృష్టిలో కూడా  మోసగాడే అయ్యాడు. మళ్ళీ ఆ నిందనుంచి విడిపింపబడేలోపే మళ్ళీ అన్న చంపెస్తాడనే భయం .తన ఆస్తినంతా భాగాలుగా చేసి అన్నకి బహుమతి పంపాడు , ఒక గుంపుపై దాడి చేసిన ఇంకో గుంపు ఇచ్చే సమాచారం బట్టి తప్పించుకోవచ్చు అనుకున్నాడు . అందరిని పంపి మళ్ళీ ఒంటరిగా మిగిలాడు . అదే స్థలం ముందు కలగని దేవుని ఆశీర్వాదం పొండుకున్న స్థలం .

ఈ సారి ఒక నరుడితో  ఉదయము వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు . మొదటి  అక్కడ అదే ప్రదేశం లో  దేవదూతలు ఎక్కి దిగడం చూసాడు . ఈ రెండవ సారి  అతనిని దేవదూతల సైన్యం ఎదురుకుంటే చూసాడు .ఎవరు లేని ఆ ప్రాంతంలో ఏ మానవుడు ఉండడని  యాకోబుకి తెలుసు మరి  ఆ నరుడు దేవునికి సంబందించిన వాడని తెలుసుకుని ఉంటాడు  (ఆదికాండము 32:24). నన్ను ఆశీర్వదించితేనే గాని వదలనని తనతో పెనుగులాడుతూనే ఉన్నాడు. అతని ప్రస్తుత స్థితి తెలుసు కున్నాడు . మోసగాడి జీవితం అని ఎదుటి వాళ్ళు తీర్మనించినా ఒంటరి చేయబడ్డ క్షణాల్లో దేవునితో ఇలా పెనుగులాడుతున్నాడు .
ఎంతగా పెనుగులాడాడో తెలుసా ? తన పట్టుకు ఆ నరుడే గెలవలేక పోయేలా చివరికి ఆ నరుడి చేతిలో తన  తొడగూడు విరిగే వరకు పెనుగులాడాడు .అయినా విడవలేదు .తన జీవితంలో ఒక మార్పు రావాలి అందుకే ఆ మార్పు ఇవ్వగల వ్యక్తి దొరికినప్పడు తన జీవితాన్నే మార్చేయగల వాణ్ని కనుగొన్నప్పుడు తన ఆశీర్వాదం దొరికే వరకు విడువనే విడువననే పట్టుదల ఒంటరి తనంలో క్రుగిపోయిన వారికి ఒక సవాలే కదా.. 

ఏం  జరుగుతుంది ? ఇద్దరి మధ్య ఆ పెనుగులాటలో జరుగుతున్న సంబాషణ ..
ఆ నరుడు :తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్ము 
యాకోబు  :నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యను
ఆ నరుడు :నీ పేరేంటి ??
యాకోబు  :యాకోబు (పేరునకు అర్ధము మోసగాడు)
ఆ నరుడు :నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని            
            యాకోబు అనబడదు 
యాకోబు  :నీ పేరు దయచేసి తెలుపుమనెను
అ నరుడు :నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.  
యాకోబు  :నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు 
            పెనూయేలు అను పేరు పెట్టెను

ఇక ఉదయం యాకోబు ఎలా నడుస్తున్నాడు ..తొడగూడు విరిగింది కదా ... కుంటుతూ నడుస్తున్నాడు .. 

ఆశీర్వాదం పొందుకున్నాడు , కుంటితేనేమి ? మోసగాడి పేరు విడిపించుకున్నాడు కుంటితేనేమి ? తన తరాలకి సరి పడ ఆశీర్వాదం పొందాడు కుంటితేనేమి ? యాకోబు అనుకుంటూ ఉండొచ్చు కుంటితే  కుంటాను జీవితాంతం ఈ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా , మోసగాడి బ్రతుకునుండి విడిపించబడి మరీ.. 

ఈ రోజు ఇలాంటి మౌనపు స్థితిలో మోసగాడని పేరు తగిలించిన లోకాన్ని పక్కకు పెట్టి ..హృదయ లోతుల్ని పరిశీలించు కుంటూ  ఒక్క సారి ఆలోచిద్దామా ? ఒకప్పుడు మోసపుస్థితి , లోకం ప్రక్కకు పడేసిన స్థితి ,ఒంటరిని చేసి గొంతుని మూగాబోయేలా  చేసిన స్థితి మౌనంగా రోదించేలా  చేసిన పరిస్థితి , కాని ఈ రోజు యాకోబు లా నాకు ఆశీర్వాదం దొరికితేనే గాని నేను నిన్ను వదలను పర్వాలేదు యాకోబు కుంటుతూ ఆశీర్వాదం మోసుకేల్లాడు నేను నష్ట పోయిన జీవితం ఇక్కడే వదిలి ఆత్మీయంగా ఆశీర్వాదం పొంది మాత్రమే , మార్పు పొంది మాత్రమే  నిన్ను వదులుతాననే పెనుగులాడే క్షణం నీ ముందుంది .. ఆ దైవ నరుని , ఆ దైవాన్ని బ్రతిమాలి తిరిగి నీ ఆత్మ విశ్వాసం నువ్వు పొంది , ఒంటరితనం నుంచి విడిపింపబడి తిరిగి లోకంలో బలం పొంది నిలబడే సమయం ఇదే .. మౌనాన్ని వీడు 

ఆశీర్వదిస్తేనే గాని నిన్ను వదిలేది లేదు అని పెనుగులాడు .

(రోజు ఉదయం 6'గంటలకి సరిగ్గా మా దగ్గర కరెంటు పోతుంది కాని దేవుడిచ్చిన తలంపులను రాయడం మొదలు పెట్టి టైం చూస్తున్నా అదేంటో టైం 7:30 అవుతున్నా నేను రాయడం ముగించే వరకు  కరెంటు పోలేదు .ఎందుకంటావ్ ??? .  ఆయన చెదరిన నీతో మాట్లాడాలని అనుకోడానికి ఇదే సాక్ష్యం ... మళ్లో  సారి గుర్తు చేస్తున్నా నేస్తమా .. లోకం నిన్ను మోసగాడివన్నా దేవుని ప్రణాళికలో నువ్వేంటో  తెలుసుకున్న రోజున దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్ధం అవ్తుంది...)


by- Mercy Margaret .. (31 /10/2012) 

------------------------------------------------------------------------------



Saturday, October 13, 2012

ఒక విత్తనం
--------------
ఒక విత్తనం ఎక్కడి నుంచో ఈ నేలనుపడి మొలకెత్తింది .
ఏ తడి ఏ ప్రవాహం ఆ విత్తనాన్ని నెట్టుకొచ్చి భూమిలోకి చేర్చిందో  నిర్వీర్యమ్మైన విత్తనం  మృతుని చూసి,
ఆయువును పోసుకొని బ్రతికినట్టు ..
పాపమును బట్టి , లోకానికై  చచ్చిపోతూ పునరుజ్జీవం పొందుతున్న ఆత్మకు 
అది రెండవ జన్మమేగా ..

విత్తనం ,విత్తనంగా మిగిలి ఉంటే..  

వృక్షాన్ని తనలో చూసుకుని ఉండకపోతే ..
అక్కడ మట్టిలో ఏ చలనపు స్థితి లేక మిగిలి పోయి ఉండేది .
చావు , జీవాన్ని ఇస్తుందా ?? కాదు అని అవును అని చెప్పలేము అనుకుంటే ఎలా ?? విత్తనం చచ్చి వృక్షం కోసం రూపు దాల్చుకుంటున్నట్టు, ఒక చావు ఇంకో జీవానికి శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా నాంది పలుకుతుంది.

చావంటే ప్రతి ఒక్కరికి భయమే కానీ ఎప్పటికీ  బ్రతికుండాలంటే  ఆ చావు రుచి చూసే ఉండాలి.లేక పోతే జీవాన్ని గూర్చిన ఆలోచన రాదు .  విత్తనం చనిపోతేనే కదా కొన్ని వందల సంవత్సరాలు బ్రతికే వృక్షంగా జీవాన్ని నింపుకోగలదు.


విత్తనం భూమిలోనే చావాలి .ఆ భూమిలో దాక్కుని తన పొరలను ఒలుచుకుంటూ  చావు కౌగిలిలో అక్షయమైన జీవాన్ని విశ్వాసంతో అంటుకట్టబడి పెంపొందించుకుంటూ , మరో జీవం కోసం ఎదురుచూస్తూ తిరిగిజన్మించాలి అప్పుడే విత్తనపు జన్మకి సార్ధకత .


నువ్వు విత్తనం ,భూమి అయిన యేసు లోకి చేరి , ప్రభువు" కృప "తడిని  ఆత్మ ప్రోక్షనని స్పృశించి మరో జీవనానికి వ్రుక్షమవడానికి  బ్రతికే ఆశను నింపుకుని అక్షయతను అణువణువునా తొడుగుకొనగలిగితే అదే కదా 

పునరుజ్జీవం ,అదే కదా రెండవ జన్మం , అదే కదా క్షయం నుంచి అక్షయానికి  ప్రయాణం .
మరణం నుంచి జీవంలోకి దాటి వెళ్లడం ..
( నా చేతిలో ఉన్న విత్తనం నాతో మాట్లడకనే వాక్యాన్ని గుర్తుచేస్తూ  మాట్లాడిన విషయం -)

Thursday, October 11, 2012

కుక్క వలె ఉండగోరుతున్నావా? లేదా కుమారుని వలె ఉండగోరుతున్నావా ?
-------------------------------------------------------------------------------------------------------
        నేడు విశ్వాసి అయిన నిన్ను ప్రభువు ప్రశ్నిస్తున్నాడు ? సురేఫెనకయ స్త్రీ రొట్టె ముక్కను కుక్కకు వేసినట్టు స్వస్థతను వేయమని అడిగింది .కాని యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి " నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని  యున్నాను "అని ప్రభువు చెప్తుంటే మనము మన విశ్వాసంలో ఇంకా రాతి నేలలో పడ్డ విత్తనంలా విశ్వాసపు వేళ్లు హృదయ లోతుల్లోనికి వెళ్ళక ,కుమారుని స్థితిని కోరుకొనక  కుక్కలా కొంచెం కొంచెం అవసరతను బట్టి వేయమని /విసరమని /జాలి పడమని అడుగుతున్నాం .!!
        
          ఆ అడిగేది కూడా  ఎలా అడుగుతున్నాం ?తెరుచుకోని  గొంతుల్లా ..స్వరం  పెగలని  వీణలా కదూ  ..ఎండిపోయి బీటలు  వారిన భూమి వర్షం కోసం ఎలా రోదిస్తూ  మొరపెడుతుందో గొంతు తడపమని ఆలోచించావా ..?సంఘానికొచ్చి  సహవాసంలో కూడి ఇలాంటి  స్తుతి , ప్రార్ధన చేస్తూ మళ్ళీ ఎదలోకే తిరిగొచ్చే ప్రార్ధనలా , బలం లేక చచ్చిపోయే విత్తనంలా మన ప్రార్ధన ఎందుకుండాలి?

        జ్ఞాపకం ఉందా ? యెరికోలో త్రోవ ప్రక్కన తిమ్మాయి కుమారుడైన గుడ్డి బిక్షగాడు ,ఎంతగా గొంతు చినిగేల అరచి ప్రభువుని పిలిచాడో  ..?ఆయన స్వరం ప్రభువు చెవిలో పడేవరకూ " దావీదు కుమారుడా నన్ను కరుణించుమని"  కేకలు వేస్తూనే ఉన్నాడు .మరి ఈ రోజు నువ్వు ఎలా ఆయనకి మొరపెడుతున్నావ్ ? ఒక సారి ఆలోచించు .ఒక వేళ  బిక్ష కోసమే అడిగి ఉంటె అతడు" ఆర్తిగా అయ్యా" అని దీనమైన స్వరం తో అరిచేవాడు కాని ఆ గ్రుడ్డివాడు ఆ రోజు భిక్ష కోసం అక్కడ కూర్చునట్టు లేదు .యేసు ప్రభు వారి గురించి వినే ఉంటాడు .యేసయ్య  చేసిన అద్భుతాలని గూర్చి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే  ఆ సురేఫేనకయ స్త్రీ లా తెలుసుకునే  ఉంటాడు .అతడి మనో నేత్రాలు ఆయన రాకకై  ఆ పాదాల కొరకై ఆ దారిన ఎంత ఎదురుచూసాయో ?
      గమనించు అద్భుతం ముందు తనకై దాగి ఉందని గ్రహించి , ఆ భిక్షగాడు ఆ సమూహాన్ని భిక్షమడగడం  లేదు కాని .ఆయనకీ జీవితాంతం సరిపడ  దీవెన కావాలి .ఆ సురేఫెనకయ స్త్రీ కి కూడా  తన జీవితాంతం మర్చిపోలేని స్వస్థత కోసం వరం అడుగుతుంది .ఎలా అడుగుతున్నారో ఈ ఇద్దరు గమనించారా?

       గ్రుడ్డి వాడు భిక్షకోసం కాదు ఏదో పొందాలని అరిచాడు అతడి స్వరం ఆయన చెవిన  పడింది .జీవితానికి సరిపడా అద్భుతం పొంది ఆశ్చర్యం అయి నిలిచాడు సాక్షిగా ..
       సురేఫెనకయ స్త్రీ వేడుకోలు ప్రభువుకు ప్రీతి కరమైంది అందుకే ఆమె విశ్వాసం పండింది .దీవెన పొందింది ఘనమైన విశ్వాసం అని ధృవీకరణ పొందుకొని వెళ్ళింది.

       ఇద్దరు కుక్కపిల్లల వలె ఎదురు చూస్తూ  వేరే వారి దయకోసం కనిపెట్టారు .కాని ఆయన వారి విశ్వాసాన్ని బట్టి వారి వేడుకోలులో ఆర్ధతను బట్టి వారిని అక్కున చేర్చుకున్నాడు .

       ప్రభువు ఈ దిన్నాన నిన్ను కుమారుడని పిలుస్తుంటే నువ్వు ఎలా వుండలనుకుంటున్నావ్ ?

        కుక్కలా భిక్ష కోసం, రొట్టె ముక్కాల కోసం చూస్తూ కొలతల్లో ఆశీర్వాదం కావాలా?లేక  కుమారుడుగా     ఉండి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని సాక్షార్ధంగా నిలబడ గోరుతున్నావా ??
..... ఇక నీదే నిర్ణయం ..

(ఆదివారపు ఆరాధనప్పుడు ఆయన నాలో మొలకెత్తింప చేసిన కొన్ని తలంపులు ) 

Tuesday, October 9, 2012

దైవీకమైన ప్రేమ :
--------------------
                         ప్రేమలో దైవత్వమున్నప్పుడు ,ప్రేమ దైవ చిత్తనుసారముగా పుట్టినప్పుడు, ప్రేమ దైవ మూలాలనుండి నిన్ను తాకి నీ లోకి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఒక ప్రవాహంలా సాగిపొతూనే ఉంటుంది .
ఆ ప్రేమ కొత్త చిగురులు తొడుగుతూ క్రొత్త క్రొత్తగా  రూపు దాల్చుతూ ఉంటుంది .ప్రతి రోజు క్రొత్తదనంతో నిండుకొని నిన్ను నీకు పరిచయం చేస్తుంది.రోజూ ఒక క్రొత్తద్రాక్షారసమై నిన్ను తన మత్తులో ముంచుతూనే ఉంటుంది .

                   దానికెప్పుడు నీ ప్రస్తుతంతోనే సంబంధం నీ వర్తమానంతో అంటుకట్టబడి నీ భవిష్యత్తు కాంక్షిస్తూ ఇవ్వాల్టి తప్పిదాలను కప్పి ఎరువుగా రేపటి ప్రేమకు బలంగానే మారుతుంది .తన భవిష్యత్తును  బలంగా చేయడానికి ప్రేమ పాదులను తన తడితో నింపుతుంది .ప్రతి  బలహీనమైన క్షణాన్ని ఆహ్వానిస్తుంది కౌగలించుకుంటుంది .తన శక్తివంతమైన బాహుబంధాల్లో మార్పును  చూపి ఆ మార్పులో ఆనందం కళ్ళలో కనిపించేంత వరకు వెంట నడుస్తూనే ఉంటుంది .జీవితపు  కూడికలు  తీసివేతలో శేషాన్ని చూడదు , మిలుగు ,మొత్తాన్ని చూడదు గాని సమాన మైన  అవగాహన సంతృప్తి కాంక్షిస్తుంది .ఎప్పుడు "ఒకటి గా "ఐక్యంగా " ఉండి విడగొట్టబడకుండా ఉండాలని కోరుకుంటుంది .

                  అన్నింటిని తనలోనికి ఆకర్షించుకొని తన రూపం లోకి మార్చుతుంది మరియు  పంపుతుంది.ప్రేమ నిర్వచనాలు లేనిది కాదు గాని  -" ప్రేమ దేవుడు " అని పౌలు అన్నట్టు నిజమైన ప్రేమ మనలో ఉండే దైవత్వమే .మనుష్యులుగా మనకున్న హద్దులను దాటి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేంతగా తన స్వభావంలోనికి , తన సమానత్వంలోనికి తనలాగే మార్చి -" జీవితం అంటే ప్రేమ " అని జీవించాల్సిన అర్ధాన్ని ,పద్దతిని ఇస్తుంది . 
   
                 తడబడ్డ అడుగులకు జోళ్లుగా ,వణుకుతునప్పుడు,  సమాధానం లేనిదేదో   చేయబోయేవేళ నీలో తన అలికిడిగా నిన్ను పాపంవైపు చూడనివ్వక వెళ్ళనివ్వక ,కృపతో కలిసి ఓటమిలో కూడా  నీకు తన రుచి చూపి విజయపు నిర్వచనం "ఇది " అని నిజాన్ని నీకు పరిచయం చేస్తుంది .   
                
                 శ్వాసలో నీకు పట్టుదలగా ఉంటుంది .నీ ఉనికిలో కర్తవ్యం నీకు వెలుగుగా ఉంటుంది .నీవు నీకు ప్రతిసారి సవాలుగా ప్రేమలోనూ అందాన్ని చూడమంటూ ఒక క్రొత్త అధ్యాయాన్ని నీతో తెరిపిస్తుంది . రోజూ  విద్యార్దినే చేస్తుంది .రోజూ  కురిసే మన్నాలా నీకు నీ అవసరతలో క్రొత్తగా నీ దగ్గరికి దిగి వస్తూ నీతో  దైవంలానే సహవాసం చేస్తుంది.

                 నిజమైన ప్రేమ ,దైవికమైన ప్రేమ నీ జీవితానికి ఉద్దేశాన్ని ,ఒక విలువను తెచ్చి నిరంతరం క్షమిస్తూ రోజూ  రోజూ    హృదయంలో క్రొత్త నీరులా ఉబుకుతూ వస్తూ నిన్నే కాదు నీ చుట్టుప్రక్కల పరిస్తితులను కూడా సమాధానంతో నింపుతుంది. శాంతి సమాధానాలతో సహవాసం చేస్తూ నీ బదులు నీకోసం నిత్యం ప్రభువుకు విజ్ఞాపన చేస్తూ నిన్ను దేవుని ముందు ఎత్తిపడుతుంది. 

               దైవీకంగా పుట్టిన ప్రేమను ఎప్పుడైనా అనుభవిస్తేనే అర్ధమవుతుంది .ప్రార్దించి అలాంటి ప్రేమని ఇమ్మని అడుగుదామా  ఇవ్వాళా ప్రభువుని ?  

(నా అనుభవంలో నేను పొందిన ప్రేమను బట్టి ప్రేరణతో రాసింది ... )